Saturday, July 31, 2010

పాదపాదాన పరిపరి దండాలు..

చాకలి శ్రీనివాస్ గెలిచాడు. ధర్మపురి శ్రీనివాస్ ఓడిపొయ్యాడు. ఉప ఎన్నికల్లో చాకలి శ్రీనివాస్ అభ్యర్థికాడు. ఇప్పుడు తన గెలుపును తాను ఆస్వాదించడానికి ఈ భూమ్మీద కూడా లేడు. మరణానంతర మెరుపు నక్షత్రం అతను. తెలంగా ణ కోసం విరిసిన తార అతను. డీ.శ్రీనివాస్ అనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి చాకలి శ్రీనివాస్ ప్రత్యర్థీ కాడు.

కానీ డీ. శ్రీనివాస్ మందూ, మార్బలాన్ని, నోట్లకట్టలను, రెండుముఖాలను, ఆడి తప్పిన అబద్ధాల పుట్టను..మొత్తంగా ఎలక్షనీరింగ్ అనే సవాలక్ష అక్రమాల గనులను బద్దలు కొట్టి గెలిచాడు చాకలి శ్రీనివాస్. వరంగల్‌లో మిర్యాల్‌కార్ సునీల్‌కుమార్ గెలిచాడు. అతనొక జర్నలిస్టు. తెలంగాణ కోసం నిలువునా ప్రాణం తీసుకున్నా డు సునీల్. రాయరాని, రాయలేని, రాయజాలని వార్తల కోసం మరణించిన సునీల్ గెలిచాడు.

అతని ఆత్మ మళ్లీ ఒకసారి వరంగల్ జిల్లా మీద తెలంగాణ మనసుగా.. ఏకాత్మగా వెలుగుతున్న ది. పేర్లెందుకు? ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక సాయికుమార్ మీగడ, ఒక సవేరా బేగమ్.. శిల్పాల మీద చెక్కాల్సిన నాలుగువందల మంది పైబడిన తెలంగాణ ఆకాంక్షలు వాళ్లు.. మరణానంతర విజయ సోపానాలు వాళ్లు.. ఎన్నికల విజయా లు.. మన దేశపు భ్రష్టుపట్టిన 'ఎలక్షనీరింగ్ ప్రలోభాల వల్ల కురచవి. తాత్కాలికమైనవి. అంతిమ పరిష్కారాల సాధనలో ఉపయోగపడనివి.

అలాంటి కురచ విజయాలను మహా శిఖరంలా మలిచిన వాళ్లు తెలంగాణ ప్రజలు. ఏమివ్వగలం..వారికి.. తెలంగాణ తప్ప. ఒక భ్రష్టుపట్టిన ఎన్నికల రూపాన్ని కూడా టీఆర్ఎస్, బీజేపీ దుమ్మురేపడానికి.. కాంగ్రెస్, టీడీపీ దిమ్మ తిరగడానికి అస్త్రంగా మలుచుకున్నారు తెలంగాణ ప్రజ. ఏకాత్మను అంగీకరిస్తామా? లేదా? అవునిది ఏకాత్మే.. హూ ఈజ్ అరవిందరెడ్డి.. తెలంగాణ తేల్చుకు రమ్మని, సైరనూది సమర రంగాన కదను తొక్కకముందు.. అరవిందరెడ్డి టీఆర్ఎస్‌తో గొడవలో ఉన్నాడు.. కేసీఆర్ అతనికి ద్రోహిగా కనబడ్డాడు. వై.ఎస్. దేవుడి గా దర్శనమిచ్చాడు.

ఇవ్వాళ అరవిందరెడ్డి మెజారిటీ డెబ్భైఏడు వేలా.. ఎవరు గెలిచారు. మంచిర్యాల్ గెలిచింది. మంచిర్యాల్ నిలిచింది. చరిత్రను తిరగరాస్తున్నది తెలంగాణ. ఒక ముసల్మా ను కాషాయ వర్ణపు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని జైతెలంగాణ అంటూ యెండల లక్ష్మీనారాయణ గెలుపు కోసం దూలాడినట్టు.. దుంకినట్టు ఎగరడం ఊహించగలరా? నిజామాబాద్ విజయగర్వం చూడండి. దేనికి సూచన ఇది. మతం లేదు. కులం లేదు. నోట్ల కట్టలు లేవు. మందు లేదు. బ్రాందీ లేదు. వాగ్దానం లేదు.

వాగాడంబరం లేదు. ఐసు ఐసు పథకాలు లేవు. నైసునైసు మాటలు లేవు. ఒకటే ఉనికిలో ఉంది. ప్రజల మనసు ల్లో.. లోపలి పొరల్లో.. ఇంకిపోయింది తెలంగాణ. పాతుకున్నది తెలంగాణ. కొప్పుల ఈశ్వరా? కావేటి సమ్మయ్యా.. చెన్నమనేని రమేశా? కల్వకుంట్ల తారకరామారావా? తన్నీరు హరీష్‌రావా? వినయ్‌భాస్కరా? ఈటెల రాజేందరా? ఏనుగు రవీందర్‌రెడ్డా? నల్లాల ఓదెలా? ఎవరైతేనేం విజయానికి ఒక ప్రతిమ కావాలి. విజయానికి ఒక రూపు కావాలి. విజయానికి ఒక పేరు కావాలి.

నిజమే హరీష్ హుర్రే.. హుర్రే.. తొంభైయిదు వేల మెజారిటీ. అదీ చరిత్రే. అతను, ఈటెల రాజేందర్ మంచి ఎమ్మెల్యేలు కూడా కావొచ్చు. అయినా మరీ అంత ఏకపక్షం ఎలా సాధ్యం.. నాలుగు వందల మంది అమరవీరుల బలిదానాలకు అంకితమిచ్చిన హరీష్‌రావు, ఈటెలల విజయం తెలంగాణ ప్రజల విజ యం. చనిపోయిన వారి ఆత్మలు మేల్కొనడమంటే ఇదే.. వాళ్ల ఆత్మలు ఆకాంక్షలై ప్రతిఫలించడమంటే ఇదే.. నలుగురు వెలమదొరలు ఒకేవాహనం మీద ఎక్కి ఎములాడల, సిరిసిల్లల తిరిగి ఎన్నికల ప్రచారంల మాట్లాడి నిలిచి.. గెలవడం ఎట్లాసాధ్యం.

అది సిరిసిల్ల.. అది జగిత్యాల. అయినా సాధ్యమే. తెలంగాణకు ఇప్పుడు ఏ ఎజెండా లేదు. ఒకే ఎజెండా.. విద్యాసాగర్‌రావు, రమేష్‌రావు, తారకరామారావు, చంద్రశేఖర్‌రావు ఎవరైతేనేం? వాళ్లే తెలంగాణ ఆత్మలను ఆవాహన చేసినంత కాలం గెలుస్తా రు. మరో మాట లేదు. ఉన్నదొకటే ఎజెండా? దొరలు .. తర్వా త.. ముందు మా తెలంగాణ మాగ్గావాలె.

మతం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె. కులం తర్వాత మా తెలంగాణ మాగ్గావాలె.. యథా ప్రజ .. తథా రాజ.. రాజులారా! ఇక తెలంగాణల ఇదే నిజం.. ప్రజలున్నట్టు మీరుంటేనే భూమ్మీద మీకు నూకలు..లేదంటే మీకు నూకలు చెల్లు.. నిజమే సర్వ అవలక్షణాలనూ తెలంగాణ ఓడించింది. బాబ్లీ ఎందుకంటావో? తెలుసు.. బాబ్లీ వెనువెంటనే మీరు తెచ్చిన తెలుగు జాతి ఆత్మగౌరవం ఎంత ప్రమాదకర నినాదమో తెలుసు. ఇరవై ఎనిమిది ఏండ్ల క్రితానికి, ఎన్టీఆర్ కాలానికి వెళ్లడానికి సిద్ధంగా లేదు తెలంగాణ.

ఆత్మగౌర వం ఒకమాయ. అదొక అబద్ధం. నిజమే బాబ్లీ అన్యాయమే కావ చ్చు.. కానీ ఆ తర్వాతి తెలుగుజాతి ఆత్మగౌరవం తెలంగాణ గౌర వం పీకనొక్కి న క్రితం ఒక చేదు జ్ఞాపకం. ఎంత విజ్ఞత తెలంగాణది. తెలుగుజాతి ఆత్మగౌరవ అసలు అంతరంగ స్వభావాన్ని బీజరూపంలో పసిగట్టిన సిస్మొగ్రాఫ్ తెలంగాణ. ఇప్పుడు అది రాబోయే పెను ముప్పును కనిపెట్టగలదు. రెండు కళ్ళ సిద్ధాంత కర్తల అసలు దృష్టినీ, అవతారాన్నీ కనిపెట్టగలదు. డిపాజిట్లు గల్లంతవుతాయి జాగ్రత్త.. ఇక చెల్లదు.

ఇది గుర్రం ఇది మైదానం. అటా.. ఇటా.. ? ఎటో ఒక దిక్కే.. తొమ్మిదో తారీ ఖు గీటురాయి. నువ్వేం మాట్లాడ్తున్నావో? బాబ్లీ అనంతర ఆత్మగౌరవం ఎవరిదో .. పసిగట్టింది తెలంగాణ. డీ. శ్రీనివాస్ బంగా రు పళ్లాన్ని నమ్మలేదు తెలంగాణ.. చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి మున్నూటా డెబ్భై మంది తలలను ఇందిరాగాంధీకి సమర్పించిన ద్రోహం.. ఎక్కడ మళ్లీ ప్రారంభమవుతున్నదో పసిగట్టింది తెలంగాణ. మహా ఉద్యమ అనంతరం ..మహా ఊరేగింపుల అనంతరం.. మహా జనసాగరాల అనంతరం.. ఒకే ఒక్క మాట.

తెలంగాణ. నిజమే.. తెలంగాణ కోసం మరణించిన ఒక కొడుకు కోసం పరితపించే ఒక తల్లికి ఈ విజయాల పూలహారం. ఆ అమ్మకిప్పుడు నాలుగు కోట్ల మంది కొడుకులు, కూతుళ్లు. తెలంగాణ కోసం వాళ్లు నిలబడ్తున్నారు. ఇస్తమని ఇవ్వరు. తెస్తమని తేరు. శవాల మీద పడి ఏడ్చిన వాళ్ళు కన్నీరు ఇంకక ముందే కల్లబొల్లి కబుర్ల కాకారాయుళ్లవుతరు. అందుకే.. బహు పరాక్.. బానిసకొక బానిసకొక.. బానిసలోయి బానిసలయిన తెలంగాణ ప్రియనేతలా రా! కాంగ్రెస్ మసిబూసి మారేడు కాయ చేస్తే.. ఇచ్చిన మాట తప్పితే బండకేసి కొడ్తది తెలంగాణ.

రెండు కండ్లు..మూడు నాల్కలు.. ఐదు ముఖాలు.. ఆరు ఆత్మగౌరవాలు చెల్లవు గాక చెల్లవు.. తెలుసుకోండి..మేల్కొన్నది తెలంగాణ.. నిజమే.. పన్నెండు సీట్లతో తెలంగాణ రాదు. మరో పన్నెండు సీట్లతో రాదూ పోదు. కానీ.. చరిత్ర నిండా.. కాలం నిండా.. తెలంగాణ ప్రతి మలుపులోనూ.. ప్రతి సందర్భంలోనూ.. తెగేసి చెబుతున్న ది.

నిలేసి అడుగుతున్నది. నీళ్లు నమలకు.. మరో మాట లేదు. ఇది తెలంగాణ ప్రజల విజయం. నిలబడి, కలెబడి నిలిచి గెలిచిన తెలంగాణ రేపటి పొద్దు తెలంగాణలోనే.. లేదా.. బానిస నేతలకు పుట్టగతులు లేవు.. మరి రావు.. మరోసారి.. మరోసారి. ఈ గడ్డమీద పుట్టిన ప్రజలకు.. ఈ గడ్డ కోసం ప్రాణాలను తృణప్రా యం చేసుకున్న వీరులకు ... వినమ్రంగా పాదపాదాన.. పరిపరి దండాలతో... హేల్ తెలంగాణ.. హేల్.. తెలంగాణ పీపుల్..

Saturday, July 24, 2010

సోంపేట తొలిపొద్దు..

ఆఊరు మీకు బాగా నచ్చుతుంది. అమెరికాలో మాడిసన్‌కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరీ నా లాగే. అయితే ఆ ఊరు ఎరీనా మొక్కజొన్న చేలల్లో కవి త్వం గుణ్‌గుణాయించే వాళ్లలా మాత్రమే ఉండదు. ఆ ఊరు చిత్తడి నేలల్లో నెత్తురు చిందించి బీలను కాపాడుకునే ఊరు. ఉత్తరాంధ్ర కోనసీమ. ఉద్దానంలో ఆ ఊరు. పేరు సోంపేట.

యాధృచ్ఛికం కాదుగానీ, సోంపేట, బారువాల మధ్య పెదబీల, చిన్న బీలల్లో నీళ్ల కోసం భూమిని రక్షించు కోవడం కోసం యుద్ధానికి తెగబడిన సోంపేటకు, కడుపు లో నీళ్లు కదలకుండా ఉండడం కోసం పలాసపురం గున్నజోగారావు, గొనప కృష్ణమూర్తి తమ మరిగే నెత్తురును ధారవోసిన సోంపేటకు, కడుపులో చల్ల కదలకుండా కవి త్వం చదువుకొని పురాయాదులను తవ్వుకొనే ఎరీనా రైతు కవులకు పోలిక ఉంది.

ఎరీనా నిశ్చల చిత్రం. సోంపేట సుడులు తిరిగిన జలతరంగ దృశ్యం. సోంపేట ఇప్పుడు నడుస్తున్న విస్థాపనకు, విధ్వంసక అభివృద్ధికి, ప్రభుత్వాలు వారే, దళారీలు వారే, కార్పొరేట్లు వారే అయిన వ్యవస్థీకరించిన పాలక పక్షాలకు ప్రాణాలొడ్డి పంట చేలల్లో ఉత్త చేతులతో, కొత్త గొంతులతో, కర్రలతో, కాళ్లకు కట్టుకున్న చేతనా విద్యుత్ తరంగాలతో గెడ్డెలు పోటెత్తినట్టు, ఎగిరి దుంకిన ట్టు ఎదురీది నిలబడిన కడలి తరంగం. హద్దులు చెరిగిపోయిన వ్యవస్థాపక నిర్మాణాలిప్పుడు ప్రపంచవ్యాప్త వ్యవస్థ లు.

అమెరికా దానికి మూలం. అది తన్నుతాను ధ్వంసం చేసుకుంటూ ప్రపంచాన్ని ధ్వంసం చేసే అభివృద్ధి నమూనాలను సరఫరా చేస్తున్నది. ఎరీనా పురాస్మృతులేవైనా ఉంటే, అవే. 'సమ్మతి తయారీ' గురించి రాసిన నోమ్‌ఛామ్‌స్కీకి, భారతదేశంలో ఇదే తరహాలో సమ్మతి తయారీ యే కాదు 'ప్రభుత్వాల తయారీ' కఅూ్ఖఊఅఇఖ్ఖీఖఐూఎ ఎౖగఉఖూకఉూఖీఖి సంగతి ఇంకా ఉప్పందవలసే ఉన్నది.

మనవాళ్లు ఈ మార్గంలో మధ్యలో లేరు. ఎంతో ఎత్తు ఎదిగారు. గనుల మాఫియా సామ్రాజ్యంతో కర్ణాటక ప్రభుత్వ తయారీని చేసి చూపించి, ఢిల్లీ ప్రభుత్వ తయారీకి నోట్లు కుడుతున్న, ఇనుప ఖనిజం జమ చేస్తున్న రెడ్డి సోదరుల గురించి కూడా నోమ్‌ఛామ్‌స్కీకి తెలిస్తే బాగుండు. కలకత్తా నుంచి నెల్లూరుదాకా తీరం పొడవునా ఆవహించే బొగ్గు కుంపట్లు థర్మల్ కారిడార్లు.. ఏ అభివృద్ధి కోసం.. ఏ మర్చంట్ విద్యుత్ కంపెనీల కోసం.. ఈ మర్చంట్ విద్యుత్ కంపెనీల లెక్కల కింద, ప్రణాళికల వెనుక, పైసా లెక్కల వెనక.. పెరిగిన వాల్యుయేషన్‌ల వెనుక ఎవరి వికృత ముఖాలున్నాయి.

థర్మల్ కారిడార్‌కు, వాన్‌పిక్‌లకు, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఆరు థర్మల్ కుంపట్లకు మొత్తంగా భారతదేశాన్ని తవ్విపోసే గనుల ఘరానా దోపిడి, భూ ఆక్రమ ణ, బొగ్గు వేగవంతంగా తవ్వడానికి, మనుషుల శవాల బొందల గడ్డలు తవ్వుతున్న ఓపెన్‌కాస్ట్ తవ్వకాలకు, ఇండోనేషియాలో బొగ్గు గనుల కొనుగోలు చేసిన హస్తాలకు ఎంత లింకుందో? అంత లింకునూ గమనించనంత వరకు.. ఈ అభివృద్ధి విధ్వంసం వెనక ఉన్న వికృత ముఖం ప్రభుత్వం, కార్పొరేట్, దళారీ కలెగలిసిన ఒక మాన్‌స్టర్‌దేనని గమనించనంత వరకు సోంపేట ఒంటరి.

అది ఒంటరి కాదు. అదొక భారతదేశపు అనేక ప్రాంతాల జంటపదం. సింగూరు తనను తాను వెల్లడించుకున్నది కనుక.. నందిగ్రామ్ కూడా చనిపోవడానికీ, చంపడానికీ సిద్ధపడింది కనుక.. సోంపేటకు అవి జంట పదాలు.. భారతదేశం నిండా పెరిగిపోతున్న సోం పేటలు రేపటి సామాన్యు ల కదనరంగాలు. ఛత్తీస్‌గఢ్ కావొచ్చు. ఒడిషా నారాయణ్ పట్న కావొ చ్చు. బెంగాల్ కావొచ్చు. బీహార్ కావొచ్చు. అది సెజ్ కావొచ్చు. గని తవ్వకం కావొచ్చు. అభివృద్ధి కోసం, వెలుగుల కోసం, రసాయనాలకోసం, ఎరువుల కోసం తీసుకునే, ఆక్రమించుకునే ఏ భూమి అయినా కావొచ్చు.

బుగతగాడిప్పుడు మారువేషంలో ఉన్న మారీచుడు. వాడు అంతుబట్టని దళారీ, కార్పొరేట్ దొంగ, ప్రభుత్వ నేత. అన్నీ కలెగలిపిన మహారాక్షసు డు. ఎట్లా చంపగలవు. ఉద్దానం ఒకప్పటి స్టాలిన్‌గ్రాడ్. తామాడ గణపతి నడయాడిన నేల, సుబ్బారావు ప్రాణిగ్రాహి గానం సుడులు తిరిగిన నేల. బొడ్డపాడు నడిగెడ్డలో గరుడభద్ర బుగత మద్ది కామేశ్వరరావును చంపినంత సుల భం కాదిది. తంపర కోసం, పెదబీల, చినబీల కోసం, ఏడాది పొడవునా ఉద్దానాన్ని ఫిల్టర్ చేసే, వరదలకు రక్షిం చే, వానల్లేనప్పుడు దూపదీర్చే.. మూత్రపిండాలా చిత్తడినేలలు.. కొబ్బరి చిప్పల్లో నిలిచిన నీళ్లు డెంగీలు, చికున్‌గున్యాలు.. చివరికి మూత్రపిండాల వ్యాధులను కట్టబెట్టిన ఇదే ఉద్దానానికి థర్మల్ బొగ్గుకుంపటి.. బూడిద సముద్రా లు వచ్చి పడ్డాయి. ఇప్పుడిక అంత సులభం కాదు.

అందుకే.. డూ ఆర్ డై.. చావు లేదా చంపు.. నీటి కోసం నిప్పులా మండు.. దేశి గెడ్డకోసం.. గరీబుల గెడ్డ కోసం.. ఏనుగుల గెడ్డకోసం.. సోంపేట నెత్తురు ఏరులై పారినా సరే.. ఇప్పుడిక భూమి కోసం.. భూమిలేని వాళ్లు చేసే పోరాటం ఎంత మాత్రం కాదింక.. భూములు కోల్పోయిన వాళ్లు.. తమ భూములు కాపాడుకోవడానికి చేసే పోరాటం.. ఇదీ నలభై ఏళ్ల పోరాటాల, ఆరాటాల శ్రీకాకుళం ప్రశ్నే కాదు.

ఇదివ్వాళ్టి దేశం సామాన్యుల ముందు, రైతుల ముందు, మత్స్యకారుల ముందు, దళితు ల ముందు, స్త్రీల ముందు, అణగారిన వారి ముందు, అన్నార్తుల ముందు, అభాగ్యుల ముందు నిలువెత్తునా నిలబడిన ప్రశ్న.. సకల మానవ ప్రాకృతిక వనరులను పెట్టుబడికి అప్పగించడమే నేటి సూత్రం. అది ఢిల్లీ కేంద్రంగా ..జంగల్ మహల్ నుంచి ఉత్తరాంధ్ర దాకా.. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా దాకా.. మనిషి అవసరాలిప్పుడు.. పెట్టుబడి అవసరాలు.. మున్నూటా అరవై ఐదు పొద్దులూ నిన్ను కాపాడే తంపర, బీలలు థర్మల్ కుంపట్ల అవసరాలు.. అందుకే.. సోంపేట ఇవ్వాల్టి వేగుచుక్క. అదొక వ్యవస్థీకృతమైన విధ్వంసక దోపిడీ మార్గాన్ని ఎదిరించిన తొలిపొద్దు.. పర్యావరణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ, అక్రమాలు, అన్యాయాలు?, పారిశ్రామిక అభివృద్ధి లేదంటే ఎట్లా? కరెంటు వద్దా? వెలుగులెట్లా? అని నంగినంగిగా గుణ్‌గుణాయిస్తూ.. అడిగేవాళ్లకు.. బహుశా.. ఈ దేశం ప్రకృతిపైన, వనరులపైన, ఈ భూమిపైన ఆధారపడి బతికే మనుషుల నోటికాడి కూడు గుంజుకొని, కార్పొరేట్లకు కట్టబెట్టడా న్ని వ్యవస్థీకృతం చేస్తుందని, సింగూరు, నందిగ్రామ్, సోంపేటలు అందుకే అని తెలియకపోతే సోంపేట అర్థం కాదు.

83 సంవత్సరాల క్రిందట బారువాకు గాంధీ వచ్చి గ్రామ స్వరాజ్యం, స్వావలంబనల గురించి, స్వయం సమృ ద్ధి గురించి చెప్పిన మాటలు ఇప్పుడొక విధ్వంసక నమూనా అభివృద్ధిలో వినపడకపోవచ్చు. 223 దినాలు నిరాహారదీక్షలు గాంధీ గారి కోసం చేసినా.. కడుపులో నీళ్లు కలబారుతున్నప్పుడు ఇదే బారువా తీరవాసులు.. నెత్తురు డొల్లాడించడం వారి తప్పుకాదు.

గాంధీని అనుసరించని విధ్వంసక అభివృద్ధిది.. ఉద్దానం మళ్లీ ఒకసారి ఉత్థానంగా వెలిగింది. ఆ వెలుగు భారతావనిలో విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకమైంది. దాన్ని ఆరిపోకుండా కాపాడుకొందాం.. మనుషు లం.. మనుషులుగా బతుకుదాం.. పోరాడి అయినా సరే.. ప్రాణాలు పోయినా సరే.. అదొక్కటే దారి.. తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర, అయినా, సీమ అయినా విధ్వంసం.. వెనుకబాటుతనంతో పాటు తీవ్ర ప్రభావం చూపే ఒక వికృతం.. దాన్ని ఎదిరిద్దాం.. ఎరీనాలో కవిత్వం చదవడం ఒక కళ.. సోంపేటలా తిరగబడడం ఒక జీవన్మరణ పోరా టం... సోంపేట ఒక తుట్టే.. ఒక చిక్కుముడి.. అమెరికా నుంచి ప్రపంచానికి పరివ్యాపించిన ఒక జబ్బుకు సోంపేట తిరుగుబాట పరిష్కారం. (ఎరీనా కవిత్వ పఠనంపై అఫ్సర్ వ్యాసం సోమవారం 'వివిధ'లో వచ్చింది.)